News

బీసీ కమిషన్‌ రాజ్యాంగబద్ధం!


చాలకాలం తరువాత వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరమైన ఈ బిల్లు 360-2 ఓట్ల తేడాతో నెగ్గింది. బిల్లు చరిత్రాత్మకమని, ఓబీసీల సంక్షేమానికి ఉపయోగపడుతుందని సామాజిక న్యాయం సాధికారత మంత్రి థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లుతో బీసీ కమిషన్‌కు ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తరహాలో అధికారాలు సంప్రాప్తిస్తాయని తెలిపారు. బీసీల్లోకి కులాలను చేర్చే, తీసేసే హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం లాగేసుకుంటోందని తృణమూల్‌, బీజేడీ ఆందోళన వ్యక్తం చేయగా, రాష్ట్రాల అధికారాల్లో ఎలాంటి కోతా పడదని మంత్రి భరోసా ఇచ్చారు. ఐదుగురు సభ్యుల కమిషన్‌లో మహిళకు చోటుండాలన్న డిమాండ్‌కు మంత్రి స్పందిస్తూ, శాసనం అమలుకు నిబంధనలు రూపొందించే సమయంలో అది చేరుస్తామన్నారు.